about
స్వీయపరిచయం
జగదాధారుడు, పరంధాముడు, స్థితికారకుడు శ్రీమహావిష్ణువు. ఆయన అపారమైన "కరుణ" అను సుగంధపరిమళము ఈ జగతిపై గరికపూవులమైన మనపై ప్రసరించాలని కోరుకుందాము. సదా ఆ పరమాత్మునకు మనమందరము కృతజ్ఞులమై వుందాము. ఆ దయామయుని దయాంబుధిలో మనము, ఈ జగమంతా ఆనందపరవశంతో ఓలలాడుదాము. మనము ఏదైనా ఒక మంచి పుస్తకము లేదా గ్రంధమును చదువుతున్నప్పుడు మన మనసు ఎంతో అనందానుభూతులను పొందుతుంది. అందులోని అందమైన అర్ధవంతమైన పదజాలం, భావం మనలను ఒక అద్భుత లోకములకు తీసుకొని వెళుతుంది. అదేవిధముగా సత్సంగ సాంగత్యం వలన మనలోని వ్యతిరేక బావములకు ఆనకట్ట వేయగలము. ఒక విషయముపై స్థిరమైన అవగాహన, నిర్ణయ నిర్ధిష్టత ఏర్పడతాయి. అనగా ఒక మనిషి ఆలోచనా పరంపరలు విషయాసక్తిపై
శ్రద్ధకాక, మంచి విషయాలపై కేంద్రీకరిస్తాడు. ఎంతో ఉన్నతంగా ఒక మనిషి ఎదుగ గలుగుతాడు. "పుస్తకపఠనం, సత్సాంగత్యం" అనునవి ఒక మనిషి ఉన్నతికి అభివృద్ధికి పునాది అవుతాయి.
భగవంతుడు మనకు ప్రసాదించిన దానిని పదిమందికీ పంచి సంతోషంగా జీవించాలన్నది ఆర్యోక్తి. ఎందరో వేదవేత్తలు, గ్రంధకర్తలు, వాగ్గేయకారులు, శాస్త్రవేత్తలు మరి ఎందరో మహానుభావులు త్రికరణశుద్ధిగా వారు ఆచరించి అపారమైన జ్ఞాన సంపదను మనకందించారు. దానిని మనము ముందు తరాలకు అందేవిధంగా కాపాడవలసిన భాద్యత మనకున్నది. కృతయుగం నాటినుండి తపస్సులు, యోగులు, పురాణపురుషులు మున్నగువారు మనం ఎలా జీవించాలో ఆధ్యాత్మికతను మన జీవనంలో ముఖ్యమైన భాగంగా ఎలా అలవరచుకోవాలో తెలిపారు. వారు గతించిన తరువాతకూడా వారి నడవడిక, సన్మార్గము మనకు మార్గదర్శకాలుగా ఉన్నాయి. అసలు "పరమాత్మ" తత్వం తెలుసుకొనుట అనునది ఒక అపురూప అనిర్వచనీయ భావన. "సృష్టినే సృష్టించిన ఆ సృష్టికర్తను గూర్చి తెలుపగల పదములు "సృష్టించగలమా"! "ఆధ్యాత్మికత" అను పరిమళ పూబాటలో సాగుతూ అమృతానుభూతిని పొందుతూ పదిమందికీ మార్గము చూపడమే మన అందరి కర్తవ్యం. అంతర్లీనంగా నీలోయున్న పరమాత్మను చూచినచో ఈ విశ్వమంతా ఒక నందనవనంగా కానవస్తుంది.
"గరికపూవునకు స్సుగంధపరిమళమబ్బెన్" అన్న రీతిగా ఆ పరంధాముడు సామాన్య గృహిణి ఐన నాకు ఇంతటి వరం ప్రసాదించాడు. ఆయనకు నేను ఏవిధముగా కృతజ్ఞతలు తెలుపగలను? నా పేరు లక్ష్మీ వల్లీ దేవి. నాకు జన్మ నిచ్చిన మాతాపితరులు త్రిపురసుందరీదేవి, రావిపాటి బాలగురునాధ శర్మ గార్లు.
ఒకనాడు నా "మనసులో" నేను ఏదైనా గేయం రాయగలనా! అని అనిపించింది. అపుడు నేను "శ్రీ మహావిష్ణువు" పైన ఒక గేయం వ్రాసాను. ఆ రోజు ప్రారంభించిన నేను ఆ దేవుని దయతో నా గేయ రచనా ప్రవాహానికి అడ్డుకట్టవేయలేదు. నాకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానంతో, దేవుని తత్వంతో ఈనాటి వరకు కొనసాగిస్తున్నాను. ఆ నారాయణుడి దయలేనిదే నేను నా రచనా ప్రయాణాన్ని కొనసాగించలేను.
భగవంతుని తత్వం తెలుసుకొనుట అనునది అంత సామాన్య విషయం కాదు. దానికి హద్దులు లేవు. స్థితికారకుడు అయిన ఆ మహావిష్ణువు గూర్చి మనం తెలుసుకొనగలమా! భగవంతునిపై నాకు కలిగిన కాదు ఆయన కలిగించిన భావములను మరల ఆయనకే అప్పజెప్పాను. అంతే! కానీ నా మనసు ఒక అనిర్వచనీయమైన ఆనందానికి లోనయింది. ఆ పరమాత్ముని అపారమైన కరుణాదృష్టితోనే నేను యీ గేయములను వ్రాయగలిగాను. ఆయనకు నా శతకోటివందనములు.
ఆ భగవంతుని కృపవలన నా గేయ ప్రవాహం అమృతమై పరవళ్ళు త్రొక్కింది. ఒక శుభముహూర్తాన మేము కనకేష్ రాథోడ్ అనే సంగీత దర్శకుడు మరియు గాయకుడిని కలవడం తటస్థించింది. అతడు మా గేయములకు రాగాలు కూర్చుటకు అంగీకరించటం జరిగింది. ఇది ఆ భగవంతుని కృప కాక మరేమిటి! అని ఎంతో సంతోషించాము. అతను ఏ పాటనైనా సునాయసముగా రాగం కూర్చగల సమర్ధుడు, నేర్పరి. పట్టుదల, కృషి, ఉత్సాహం ఉన్నవాడు. ఆతడి ఆధ్వర్యంలో మావారి సంకల్పం వలన నా గేయాలు ఒక చక్కని రూపం దాల్చి అనగా సంకీర్తనలుగా చక్కటి రాగాలతో వెలువడినాయి. మాకు, ఈ బృహత్తర కార్యం శ్రీకారం చుట్టినది మొదలు ఆ భగవంతుని కృప వలన ఏ ఆటంకములు లేకుండా సంతోషముతో పూర్తిచేయడానికి ఆరు మాసములు పట్టింది. ఆ విద్వాంసుడి కృషి, పట్టుదల, శక్తి సామర్ధ్యములు సామాన్యమైనవి కాదు సుమా! "స్వర్ణానికి మెరుగు దిద్దినట్టుగా" భగవంతుని దయ మా పైన ఉన్నందువలననే యిది సాధ్యమైనది. గాయకులు మరియు ఇతర సాంకేతిక సిబ్బంది కూడ ఎంతో ఉత్సాహంతో భక్తి పారవశ్యంతో ఒకరిని మించిన వారొకరుగా కృషి చేసారు. వారికి మా కృతజ్ఞతలు, ఆశీస్సులు.
మా శ్రీవారు శ్రీ బిజిబిళ్ళ రామారావు గారు ఈ బృహత్తర కార్యక్రమం సంకల్పం చేసిన నాటినుండి ఎంతో ఉత్సాహంతో నన్ను ప్రోత్సాహించారు. ఆయన నాకు అడుగడుగున ఎనలేని స్పూర్తితో సహాయ సహకారములందించారు.
మా ఈ "బిజిబిళ్ళ ఫౌండషన్" నూతనంగా ప్రారంభించబడింది. ఈ సంస్థ ముందు ముందు మంచి మంచి ఆధ్యాత్మిక కార్యక్రమములు చేపట్టాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాము. ఈ సంస్థ ద్వారా మేము ప్రజలకు ఎన్నో మంచి కార్యక్రమములను అందించాలని ఆధ్యాత్మికంగా భగవంతునికి సేవ చేయాలని కోరుకుంటున్నాము.
మా ఈ చిన్ని ప్రయత్నాన్ని అందరూ సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
నమస్కారం.
బిజిబిళ్ళ లక్ష్మీ వల్లీ దేవి
రచయిత
credits
released February 28, 2020
ఓం
రచన: "కవిరాజు, సాహితీ యువరత్న" డా. కావూరి శ్రీనివాస్
నంది అవార్డు గ్రహీత, కవి, శాసన తాళపత్ర గ్రంధ పరిశోధకుడు
మరియు పరిశోధన అధికారి, తెలంగాణా పర్యాటక శాఖ,
(బుద్ధవనం), హైదరాబాదు.
వాగ్దేవీనమ: నమ: శ్రీ శారదా ఓం
భక్తినివేదన
అమ్మగారు శ్రీమతి బిజిబిళ్ళ లక్ష్మీవల్లీదేవి గారి హస్తాక్షర, సుమధుర, సుమనోహర "సుధన్వాసంకీర్తనామృతం" భక్తిత్వానికి - ముక్తిత్వానికి ఇది ఎంతో విలువైన సంకీర్తనల సంపుటి. ఇందులో ఆధ్యాత్మిక-భక్తి-తత్వ గేయములు విపులంగా విశదీకరించి వ్రాసినారు. ఈ మన భారతావనిలో ఎందరో మహానుభావులు రచించిన సంకీర్తనలను, తత్వములను, రగడలను, స్తోత్రములను, దండకములను, గేయములను (పాటలను) ఇంకా ఇతరత్రా ఎన్నో భక్తికి సంభందించినవి ఉన్నాయి. అయితే కొందరు మాత్రమే వెలుగులోకి వచ్చారు. మరికొందరు చరిత్ర గర్భంలోనే మిగిలిపోయారు. వారిలో 13వ శతాబ్దం నాటి షడాక్షరస్వామి, 14, 15 శతాబ్దములనాటి కృష్ణమాచార్యులు, ఇలా ఎందరో, అయితే ఒక్కక్కరూ ఒక్కొక్క ఒరవడిని సృష్టించారు. అమ్మగారు వ్రాసిన ఈ సంకీర్తనల్లో అన్నీ మృదు మధురంగానే ఉన్నాయి అనుటలో ఏ మాత్రం కించిత్ సందేహములేదు. భక్తులు, అశేష ప్రజానీకం, ఆదరించి, ఈ సంకీర్తనలను భక్తితో చదివి ధన్యులౌతారని నా ప్రగాఢ విశ్వాసం. ఇందులో, మృదు మధ్యాక్కర-మాత్రా-అలంకార భావాలతో కూడుకున్న భక్తి సంకీర్తనలు ఇవి. ఒకచోట అమ్మగారు ఇలా అంటారు చూడండి.
"అంబా, జగదంబా" గేయంలో చివరి చరణంలో…..
"చరణం": అష్ట దిక్కులు పాలించే పరమేశ్వరి - పరమపావని (2)
దుష్ట సంహారిణి, దురిత విమోచని నీవు అంబా, జగదంబా "అంబా" (2)
ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. తల్లులగన్న తల్లి మహాతల్లి చతుర్దశ భువనాల శక్తి స్వరూపిణీ నాతల్లి దయ ఈ తల్లిపై దండిగా ఉండాలని మరెన్నో మహోన్నత సంకీర్తనలను వ్రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ!!!
"శుభంభూయాత్" - శ్రేయోస్తుతేసదా!!!
డా. కావూరి శ్రీనివాస్
శ్రీ
ఆచార్య ఎన్.ఎస్.రాజు, విశ్రాంత అధ్యక్షులు, తెలుగుశాఖ, హైదరాబాదుకేంద్రవిశ్వవిద్యాలయం297, డోయెన్కాలని, శేరిలింగంపల్లి, హైదరాబాదు.
10-04-2016
శ్రీమతి బిజిబిళ్ళ లక్ష్మీవల్లీదేవిగారు రచించిన "సుధన్వా సంకీర్తనం" అనే సంపుటి గ్రంథంలో 148 కీర్తనలు ఉన్నాయి. అవి 12 విభాగాలుగా విభక్తమయ్యాయి. ఈ కీర్తనలు భక్తిభావతన్మయత్వంలో వెలువడిన భక్తిరసగుళికలు. భగవంతుని సుప్రభాతసేవ, పవళింపుసేవ మొదలైన సేవలను కీర్తించినట్లు రచయిత్రి ఈసంపుటిని భగవంతుని ఉపనయనసేవ సంకీర్తనంతో ప్రారంభించి ఒక ప్రత్యేకతను నిలిపారు. శ్రీకృష్ణ స్తుతులతో మొదలైన ఈసంకీర్తనలలో క్రమంగా శ్రీరామ, వినాయక, శివ, దుర్గ, ఆంజనేయ, వేంకటెశ్వర, లక్ష్మి, పాండురంగ, శ్రీహరి, సత్యనారాయణ మొదలైన అర్చనారూపదేవతామూర్తుల స్తుతులు ఉన్నాయి. ఈకీర్తనలలో సగుణరూప వర్ణనతోపాటుగా నిర్గుణ పరబ్రహ్మమును కూడా వర్ణించడం రచయిత్రి ఆధ్యాత్మిక పరిణతికి నిదర్శనం. కీర్తనలు చిన్న చిన్న పదాలతో సరళమైన కూర్పుతో సహజమైన రచనగా ఒప్పుతున్నాయి. ఈసంకీర్తనలు అనుప్రాసలు, పద-అక్షర ఆవృత్తులతోను, ఆది-అంత్యప్రాసలతోను అప్రయత్న మాత్రాఛందస్సుతోను, కూడి శ్రావ్యతాగుణంతో భాసిస్తున్నాయి. భావరమణీయంతోపాటు శాబ్దికరమణీయంకూడా చాలా కీర్తనలలో కనబడుతుంది.
"కృష్ణం మధురం నీజననం
బాలకృష్ణం సతతం నీస్మరణం"
మొదలైన పల్లవులు జయదేవునిగీతగోవిందాన్ని స్మరణకుతెస్తున్నాయి.
"దోబూచులాడేవురా కృష్ణయ్యా!
బూచులు దునిమేటి అల్లరి కన్నయ్యా!"
"శకటాసురుని దన్నినపదములు
నొప్పిగొనినవా! చక్కని స్వామీ!
పూతనప్రాణముహరియించిన
నీనోరునొప్పిగొనినదా స్వామి"
మొదలైన గేయపంక్తులు భక్తిభావాన్ని ఆలంకారికంగా ప్రకటించడాన్ని వెల్లడిచేస్తున్నాయి. "అలరాముడైననూ”(27) "ఇలలోన" (29)వంటి కీర్తనలుదీనికి మరి కొన్నినిదర్శనలు.
నిర్గుణ పరబ్రహ్మమును కాంతిస్వరూపంగా సంభావించడాన్ని "ఈలోకమంత వెలుగు – మనశోకమంత తొలగు" వంటి పాదాలలో రచయిత్రి ప్రకటించడం వారి తాత్విక భావ సంపదకు ఉదాహరణం.
"ఆటపాటల జోల ...విద్యార్జన హేల ...
వయసుడిగిన వేళ ... వేదాంత ఊయల ..........."వంటి పాదాలు అంత్య ప్రాసకు,
"ముద్దులకృష్ణుడె.......ముత్యపుటుంగరముల..........., పరమాత్ముడు..........పరముతానై............." వంటి
పాదాలు ఆద్యక్షరావృత్తికి నిదర్శనలు. "చెరసాలలో జరిగెను జననం, చెఱలు విడిపించు నీ చరణం (17) వంటి పాదాలుఆదిప్రాసకు నిదర్శనలు. ఇలా చాలా కీర్తనలు కవితా సౌందర్యాన్నికూడా ప్రకటిస్తున్నాయి.
ఈవిథంగా వీరి సంకీర్తనల సంపుటినుంచి ఎన్ని విశేషాలనైనా చూపవచ్చు. గీతా మాధుర్యానికి గనివంటి “సుధన్వా సంకీర్తనల” సంపుటిద్వారా రచయిత్రి మరొక మీరాబాయిగా వాసికెక్కగలరని విశ్వసిస్తూ వారికి సర్వమంగళములు కలుగజేయవలసిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను.
శుభం.
నడుపల్లి శ్రీరామరాజు
ఓంశ్రీసాయిరాం
హైదరాబాద్ 05-04-2016
ఆచార్య పోతుకూచి ఉమాభట్టీశ్వరశర్మ, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్.డి.
అతిథి ఆచార్యులు, హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం, హైదరాబాద్.
"భక్తిరేవగరీయసీ" – అన్నారు ప్రాజ్ఞులు. భగవంతునికంటె భగవద్భక్తులే శ్రేష్ఠులని నిరూపింపబడిన ఘట్టాలకు మనపురాణాలలో కొదువలేదు. భగవంతుడు భగవద్భక్తుల సంకీర్తనలలో కొలువై ఉంటాడని నారద ఉవాచ. ఈ అన్నివిషయాలనూ ఆకళింపుచేసుకొన్న మహిళామణి శ్రీమతి బిజిబిళ్ళ లక్ష్మీవల్లీదేవి గారని నా అభిప్రాయము.
కాబట్టే త్యాగయ్య, అన్నమయ్య, పురందరదాసు, రామదాసు వంటి భక్తశిఖామణుల సంకీర్తనలకేమాత్రము తీసిపోని విధంగా తమ "సుధన్వాసంకీర్తనం" రచనాగ్రంధము సాగించారనటం ఏమాత్రం అతిశయోక్తి కాదేమో. ప్రతికీర్తన ఒకరసగుళిక. నా పూర్వజన్మ పుణ్యఫలాన నేను ప్రస్తుతకవయిత్రి తండ్రిగారైన "బ్రహ్మశ్రీ రావిపాటి బాలగురునాధశర్మగారి" కొన్ని పారమార్ధిక వ్యాసాలను చదవటం తటస్థించింది. అలాంటి మహనీయుని పుత్రికకు భక్తిరస భావబంధురమైన కవిత ప్రాప్తించటం ఆశ్చర్యమేమీకాదు. పైగా అది సహజంకూడా.
"సుధన్వాసంకీర్తనం" - అనే ఈ మధుర భక్తిరసకావ్యం మధురాతి మధురమైన కీర్తనలతో నిండిఉంది."పోతన్నతెల్గులపుణ్యపేటి" అని విశ్వనాథ సత్యనారాయణగారు పోతన కవిత్వాన్నిమెచ్చుకొన్నారు. శ్రీమతి లక్ష్మీవల్లీదేవి గారు కూడా పోతన మహాకవికి ఏమాత్రం తీసిపోనివిధంగా భక్తిరసమాధుర్యంతో తమకీర్తనలను నింపివేశారు. వారికి నామనఃపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
భవదీయుడు
డా.పోతుకూచిఉమాభట్టీశ్వరశర్మ (M) 8186818811
ఓంనమోభగవతేవాసుదేవాయ! ఓంనమోవేంకటేశాయ! ఓంనమోశ్రీవిఘ్నేశ్వరాయ!
అభినందనలు
ప్రియమైన సోదరి శ్రీమతి లక్ష్మీవల్లీ దేవికి మీ సోదరుడు సుబ్రమణ్య శర్మ శుభాభి నందనలతో వ్యక్తపరుస్తున్న విషయములు:
మీరు ఎంతో భక్తిశ్రద్ధలతో పంపిన "సుధన్వాసంకీర్తనం" రచనాగ్రంధము అందినదని తెలియపరచుటకు సంతోషిస్తున్నాను. ఆ భగవంతునిపై రచించిన కీర్తనలు ఎంతో శ్రద్ధతో చేసారు. సదా భగవదానుగ్రహం కలుగు గాక. అన్ని జన్మలలో మానవ జన్మ చాల అత్యుత్తమమైనదని, అట్టిమానవులు సదా భగవంతుని స్మరిస్తూ మరో జన్మ లేనివారిగా మోక్ష ప్రాప్తి పొందటానికి ప్రయత్నించాలని భగవద్గీత విశదీకరిస్తున్నది.
ప్రతి మానవడు నవ విధ భక్తి విధానముల ద్వారా భగవంతుని చేరవచ్చ్హని గీతోపదేశం చేస్తున్నది. మీరు రచించిన ఈ సంకీర్తనలలో ప్రతి అక్షరము, పదము మరియు వాక్యము భగవంతుని స్మరిస్తూ అత్యున్నతమైన మోక్షమార్గమును సూచిస్తున్నాయి అనుటలో ఏ మాత్రం సందేహము లేదు.
ఈ భగవన్నామ స్మరణ తత్వము ఎన్నో జన్మల పుణ్యఫలము మరియు సత్కార్యముల చేతనే లభిస్తుంది. ఈ సంకీర్తనలు ఎంతో మ్రుదుమధురంగాను, ఆహ్లాదకరంగాను మనస్సుకి సంతృప్తినిచ్చేవిగాను ఉన్నాయి. మీరు రచించిన ఈ రచనా గ్రంధము భావితరాలకు ఎంతో ఉపయోగకరము మరియు ఆదర్శప్రాయంగా నిలుస్తుందనటంలో ఎటువంటి సందేహములేదు. కేవలం ఒక్క భగవంతుని స్మరణ మార్గము ద్వారా మాత్రమే జన్మ బంధముల నుండి విముక్తి పొందుతారని, భగహదానుగ్రహముకంటే మనిషికి ఇంక ఏమి కావాలి? ఇన్నివందల కీర్తనలు రచించిన మీకు ఆ భగహదానుగ్రహం తప్పక లభిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. భగవంతుని స్మరణకు మించినది ఈ ప్రపంచములో మరొకటి లేదు. మీ సంకీర్తనలద్వారా ప్రజలందరిని చైతన్య పరచి దైవ స్మరణ చేయిస్తున్న మీకు ఆ భగవంతుడు నిరంతరం ఆశీర్వదించుగాక!
రావిపాటి సుబ్రమణ్య శర్మ, ఆఫీసర్, ఆంధ్రా బ్యాంక్(రిటైర్డు)